దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా.. సింపుల్గా డబ్బులు వచ్చేస్తాయన్న భ్రమలో పడి, ప్రజలు మోసపోతున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే.. రోజుకు రూ. 5వేల వరకు సంపాదించుకోవచ్చు అని వచ్చిన ఓ మెసేజ్ను నమ్మిన ఓ మహిళ.. ఏకంగా రూ. 13లక్షల వరకు మోసపోయింది!
ఇదీ జరిగింది..
గ్రేటర్ నోయిడాలోని పంచ్షీల్ హైనిష్ సొసైటీలో నివాసముంటున్న కార్తికకు కొన్ని నెలల క్రితం ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. వర్క్ ఫ్రం హోంకు సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి. యూట్యూబ్లో వీడియోలు లైక్ చేసి, ఛానెళ్లకు సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజుకు రూ. 50 నుంచి రూ. 5000 వరకు డబ్బులు సంపాదించవచ్చు అని ఆ మెసేజ్లో రాసి ఉంది. చాలా సింపుల్గా డబ్బులు సంపాదించుకోవచ్చు అని భావించిన ఆమె.. సంబంధిత మెసేజ్లో ఉన్న టెలిగ్రామ్ అకౌంట్ లింక్పై క్లిక్ చేసి, వారిని సంప్రదించింది.
స్కామ్స్టర్స్.. యూట్యూప్లో వీడియోలకు లైక్ కొట్టడంతో ఆమెకు రూ. 150 ఇచ్చారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. డబ్బులు వస్తున్నాయి కదా అని ఆమె వారిని నమ్మడం మొదలుపెట్టింది.
ఇదీ చూడండి:- IRCTC : యూజర్లకు ఐఆర్సీటీసీ హెచ్చరిక.. వాటిని వాడొద్దంటూ జాగ్రత్తలు
అప్పుడే మోసగాళ్లు తమ పని మొదలుపెట్టారు. ‘రూ.2వేలు ఇన్వెస్ట్ చెయ్.. మంచి రిటర్నులు వస్తాయి,’ అని చెప్పడంతో ఆమె వారికి డబ్బులు ఇచ్చింది. అదే రోజు రూ. 3,150 వెనక్కి రావడంతో ఇక ఆమె ఏం ఆలోచించలేదు. రూ. 5వేలు, రూ. 30వేలు, రూ. 90వేలు.. ఇలా భారీ మొత్తాలను ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత రిటర్నులు ఆగిపోయాయి.
‘పోయాం.. మోసం..’
YouTube Job scam news : ఏం జరిగిందని ప్రశ్నించగా.. ఒక టాస్క్ తప్పుగా చేసిందని, అందుకే ఆగిపోయాని నేరగాళ్లు చెప్పారు. ఇంకో లింక్ ఇచ్చి, దానిని పూర్తి చేసి, మళ్లీ ఇన్వెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే.. పెట్టిన డబ్బులు వెనక్కి తిరిగిరావని భయపడిన ఆమె.. ఇంకా, ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లింది. లోన్లు తీసుకుని కూడా డబ్బులు ఇచ్చింది. “రూ. 15లక్షల అమౌంట్ దాటితే.. ఫుల్ పేమెంట్ ఇస్తాము,” అని స్కామర్ అనడంతో ఆమెకు, ఆమె భర్తకు డౌట్ కొట్టింది. ఇంకో సందర్భంలో రూ. 5లక్షలు ఇవ్వాలని అడిగిన తర్వాత.. తాము మోసపోయామని వారికి అర్థమైంది. చివరికి వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.