వాషింగ్టన్: ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ఎక్స్ అధినేత, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లిన తరువాత ట్విట్టర్లో పలు మార్పులు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి.
వాటికి అంతు ఉండట్లేదు. ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలను స్వీకరించిన తొలి రోజు నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టిన ఆయన.. మరిన్ని సంస్కరణలకు తెర తీశారు.
లోగో మొదలుకుని అన్ని సెగ్మెంట్లలోనూ పెను మార్పులను తీసుకొచ్చారు. బ్లూ బర్డ్ లోగోను తొలగించి బ్లాక్ ఎక్స్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాన్ మస్క్. బ్లూ టిక్ కోసం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ను ప్రవేశపెట్టారు. బ్లూ టిక్ బ్యాడ్జిని పొందాలంటే డబ్బులను కట్టాల్సిన పరిస్థితి ఉంది.
ఇప్పుడు దీన్ని మరింత విస్తరించారు ఎలాన్ మస్క్. పోస్టింగ్లకు కూడా డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. దీనికోసం కొత్తగా వార్షిక సబ్స్క్రిప్షన్ విధానంలో మార్పులు చేశారు. ఇకపై ట్విట్టర్ అకౌంట్ వినియోగం అనేది ఉచితం కానే కాదు. దీన్ని యూజ్ చేయాలంటే డబ్బులు కట్టాల్సి ఉంటుంది.
ఎక్స్ యూజర్లు ఇకపై సంవత్సరానికి ఒక డాలర్ చొప్పున కట్టాలి. దీనికి అవసరమైన సబ్స్క్రిప్షన్ ఉంటేనే యూజర్లు తమ అకౌంట్ ద్వారా రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ఈ విధానాన్ని న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్లో అమల్లోకి తీసుకొచ్చారు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.
ఈ రెండు దేశాల్లో ఎక్స్ అకౌంట్ను ఓపెన్ చేయాలీ అంటే డబ్బులు కట్టాలి. ఫిలిప్పీన్స్లో 0.75, న్యూజిలాండ్లో 0.85 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. క్రమంగా ఈ విధానాన్ని అన్ని దేశాలకు విస్తరించనున్నారు. సబ్స్క్రిప్షన్ లేనివారు- ఎక్స్ ప్లాట్ఫామ్పై పోస్ట్ అయ్యే సమాచారాన్ని చదవొచ్చు. వీడియోలను చూడొచ్చు. తమకు నచ్చిన వారి అకౌంట్లను ఫాలో అవ్వొచ్చు. పోస్టింగ్ మాత్రం సాధ్యపడదు.