ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు.. ఇప్పటి వరకూ ఒక లెక్క ఇప్పుడో లెక్క. ప్రధాన పోటీ వైసీపీ , టిడిపి-జనసేన-బీజేపీ కూటమి మధ్య ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ జగన్ సోదరి షర్మిల కాంగ్రెస్ లో చేరి.. ఏపీ పగ్గాలు చేపట్టడంతో అధికార వైసీపీలో టెన్షన్ మొదలైంది. షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఏపీలో పోటీ చేయబోతుంది. ఈ నేపథ్యంలో శనివారం గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఏపీసీసీ చీఫ్ షర్మిల విజయవాడలో ప్రారంభించారు. ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలను అమలు చేస్తామని పేర్కొన్నారామె.
ఈ సందర్భంగా.. కాంగ్రెస్ 9 గ్యారెంటీల పాంప్లేట్, డోర్ స్టిక్కర్లను ఆవిష్కరించారు. అనంతరం 9 గ్యారెంటీల గురించి వివరించారు.
ఏపీ కాంగ్రెస్ 9 గ్యారెంటీలు
1. రాష్ట్రానికి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదేళ్లు ప్రత్యేక హోదా.. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు..
2.మహిళా మహాలక్ష్మి
ప్రతిపేద మహిళకు నెలకు రూ.8500
ఏడాదికి లక్షరూపాయలు
3.రైతుల రుణమాఫీ
రైతులకు 2 లక్షల వరకూ రుణమాఫీ
4.రైతులకు 50 శాతం లాభంతో కొత్త మద్దతుధర
5.ఉపాధిహామీ పథకం కూలీలకు కనీస వేతనం రూ.400 అందించడం
6.కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య
7.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ
8.ప్రతి పేద కుటుంబానికి యజమానురాలి పేరుపై రూ.5 లక్షలతో పక్కా ఇళ్లు
9.ఇంట్లో ఉన్న వృద్ధులందరికీ పెన్షన్
అర్హులైన ప్రతిఒక్కరికీ రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు పెన్షన్
ఏపీలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు తెలిపారు షర్మిల. ఇప్పటికే 1500 అప్లికేషన్లు వచ్చాయని, వారిలో 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు హై కమాండ్ తో చర్చించాలని, అందుకోసమే ఆదివారం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు. అభ్యర్థి పనితనం ఆధారంగా టికెట్ కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని తెలిపారు.