అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించిన ఆయనకు ఆశాభంగం కలిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన రాజకీయలకు గుడ్ బై చెప్పారు.
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా బండారు సత్యనారాయణ విశాఖ జిల్లా పెందుర్తి సీటు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన నేత పంచకర్ల రమేశ్ కు దక్కింది. దీంతో ఆయన తీవ్ర అంసతృప్తికి గురయ్యారు. అయితే పార్టీ తన నిర్ణయం మార్చుకుని చివరి లిస్ట్ లో అయినా తన పేరును ప్రకటిస్తుందేమోనని వేచి చూశారు. చివరి జాబితాలో కూడా ఆయనకు టీడీపీ టికెట్ కేటాయించలేదు. దీంతో పార్టీ మారడం ఇష్టం లేని ఆయన రాజకీయలకు స్వస్థి పలికారు.
ఇటీవలే పెందుర్తి టికెట్ జనసేన నేతకు కేటాయించడంతో ఈయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వెంటనే అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగాయి. దీంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు సత్యనారాయణను ఆస్పత్రిలో చేర్పించారు. అయితే టీడీపీ బండారుకు టికెట్ కేటాయించకపోవడంతో.. ఆయన వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ వాటన్నింటీకి బండారు సత్యనారాయణ చెక్ పెట్టారు.
విశాఖలోని పరవాడ మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు సత్యనారాయణ ప్రకటించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాజకీయంగా తనకు ఇదే చివరి సమావేశం అని కూడా కార్యకర్తలకు, అభిమానులకు తెలిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నాసరే.. పార్టీ కార్యకర్తలకు మాత్రం అండగానే ఉంటానని హామీ ఇచ్చారు.