ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారిగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై అధికారికంగా స్పదించారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతోందని అన్నారు. అయితే కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. త్వరలోనే చర్లపల్లి జైలులో చిప్పకూడు తినాల్సి వస్తుందని అన్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పుకుండా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
‘ట్యాపింగ్ కేసుపై విచారణ జరుగుతోంది. కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కొన్ని ఫోన్ కాల్స్ విన్నామని కేటీఆర్ చెబుతున్నారు. ఎవరైనా ఇతర కుటుంబసబభ్యుల ఫోన్ కాల్స్ వింటారా..? అలా వింటే చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
‘మహబూబ్ నగర్ జిల్లాకు మోదీ ఏం ఇచ్చారు. డేకే అరుణ జాతీయ అధ్యక్షురాలి పదవి తెచ్చుకుంది. మరి పాలమూరు ప్రాజెక్ట్ కు ఎందుకు జాతీయ హోదా తీసుకురాలేదు. మోదీ ఇక్కడ ఉండే వ్యక్తి కాదు.. ఉండేవాళ్లం మనం. గద్వాలలో బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు ఒక్కటయ్యాయి.
గడీలను బద్దలుకొట్టి ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మహబాబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు మనదే. మహబూబ్ నగర్ లో దెబ్బ తీస్తే కాంగ్రెస్ ను రాష్ట్రమంతా బలహాన పరచవచ్చని అనుకున్నారు. ఇచ్చిన హామీల్లో కొన్ని ఇప్పటికే అమలు చేశాం. ఎన్నికల కోడ్ వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోలేక పోయాం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.