పోరాట పంథాలో కథం తొక్కుదాం.. కేసీఆర్‌ని ప్రజలే కాపాడుకుంటారు.. కేటీఆర్ సంచలన ట్వీట్..

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కారు దిగి పలువురు అగ్రనేతలు హస్తం గూటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారిన కొద్ది రోజులకే.. ఎంపీ కేకే, మేయర్ విజలక్ష్మి కేసీఆర్‌కు గట్టి షాక్ ఇచ్చారు. కేసీఆర్ తో సమావేశం అయిన కాసేపటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు రావడం సంచలన రేపాయి. ఇటు కేకే పార్టీ మారుతున్న విషయం తెలిసిందో లేదో.. మరోవైపు వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ మారగా.. ఎన్నికలలోపు మరికొంత మంది అభ్యర్థులు జంప్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే, పార్టీలో నెలకొన్న పరిస్థితులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా స్పందించారు.

 

పార్టీలు మారుతున్న అగ్ర నేతల తీరుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘శూన్యం నుండి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి మన కేసీఆర్. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారుచేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ప్రజా ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ పోస్ట్ ని షేర్ చేయండి :

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Pinterest
Print

మరిన్ని చదవండి :